సీఏం రేవంత్ రెడ్డికి ఈటల బహిరంగ లేఖ

  • మూసీ ప్రక్షాళనపై స్పందించిన ఈటల
  • తాను పేదల కోసం కొట్లాడిన వ్యక్తినని వెల్లడి
  • మూసీ ప్రక్షాళనను అడ్డుకోబోనని స్పష్టీకరణ
  • కానీ పట్టా ఇళ్లలో ఉంటున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ బహిరంగ లేఖ రాశారు. తాను పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడిన వ్యక్తినని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న మూసీ ప్రక్షాళనకు అడ్డు తగలబోనని స్పష్టం చేశారు.

అయితే, పట్టా ఇళ్లలో ఉంటున్న వారిని బఫర్ జోన్ పేరుతో అక్రమంగా నివాసం ఉంటున్నారని చిత్రీకరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. పిడికెడు అక్రమ ఇళ్లను బూచిగా, రూ. కోట్ల విలువ చేసే ఇళ్లను కూలగొడుతున్నారని విమర్శించారు.  

"మమ్మల్ని కాలకేయులతో పోల్చడం మీకు సంస్కారమేనా? మూసీ నది ప్రక్షాళనకు మీ కార్యాచరణ ప్రణాళిక ఏంటి? డీపీఆర్ సిద్ధంగా ఉందా? ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం ఏమైనా చేస్తున్నారా? కోట్ల విలువైన ఇళ్లు కూలగొట్టి, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటే ఎలా? ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ నిర్ధారించకుండా ఎలా కూల్చివేస్తారు?" అంటూ ఈటల సూటిగా ప్రశ్నించారు. 

హైదరాబాద్ భవిష్యత్ ను, అభివృద్ధిని ప్రశ్నార్థకంగా మార్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Eatala Rajendar
Revanth Reddy
Musi River
BJP
Congress
Hyderabad
Telangana

More Telugu News